1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (13:27 IST)

వలంటీర్లు దైవాంశ సంభూతులు : ఏపీ మంత్రి మేరుగ నాగార్జున

meruga nagarjuna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వలంటీర్లు దేవాంశ సంభూతులని ఆ రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున అన్నారు అలాంటి వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే వారిని దేవుడు కూడా క్షమించరని ఆయన సెలవిచ్చారు. ఏపీలో మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని, ఒంటరి అతివల సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. పవన్‌ వ్యాఖ్యలను మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా సోమవారం వేర్వేరుగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దారుణమని, వాటిని పవన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. 
 
అయితే, మంత్రి మేరుగ నాగార్జున మాత్రం ఓ అడుగు ముందుకేసి.. వాలంటీర్లు దైవాంశ సంభూతులని అభివర్ణించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఇళ్ల వద్దకు వెళ్లి కాళ్లు, కళ్లు లేనివారికి, వృద్ధులకు, మహిళలకు సహాయం చేస్తున్నారు. కరోనా వచ్చినవారిని కుటుంబ సభ్యులే పట్టించుకోని సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివి. వారిపై నిందలు వేస్తే దేవుడు క్షమించడు అని అన్నారు. 
 
అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను రద్దు చేస్తామని పవన్‌ చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. వాలంటీర్లపై పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు దారుణమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. 'పవన్‌ కల్యాణ్‌ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. అంతేగాని జగన్‌ను, ప్రభుత్వాన్ని నిందిస్తే ఏం వస్తుంది' అని విమర్శించారు.