గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (13:51 IST)

నరసాపురం ఎంపీడీవో అదృశ్యం.. ఏలూరు కాల్వలో మృతదేహం

నరసాపురం ఎంపీడీవో అదృశ్యం వ్యవహారం విషాదాంతమైంది. జూలై 16న అదృశ్యమైన ఎంపీడీవో మృతదేహాన్ని విజయవాడ శివార్లలో ఏలూరు కాల్వలో గుర్తించారు. నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు జూలై 15 నుంచి కనిపించకుండా పోయారు.

అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గత బుధవారం (జూలై 17)న ఆదేశించారు. ఏలూరు కాల్వలో వెంకటరమణ దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మొబైల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేయడంతో విజయవాడలోని మధురానగర్‌ ఏలూరు కాల్వ వద్ద సిగ్నల్‌ కట్‌ అయినట్లు గుర్తించారు. దీంతో గత వారం రోజులుగా ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మధురానగర్ ఫ్లై వంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. వంతెనపై నుంచి దూకిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిఎంపీడీవో కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.