1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (16:09 IST)

సీఎం జగన్‌తో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రతినిధుల భేటీ

ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌‌మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో గురువారం భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో గురువారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. 
 
రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టులకోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70శాతాన్ని బ్యాంకు మంజూరుచేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. 
 
ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్,  చైనా, సౌతాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈ బ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరుచేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25 వేల కోట్లు మంజూరు చేసింది.