ఖమ్మం పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోతే మంత్రి కేటీఆర్ ఆ పని చేస్తారట!
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మ జిల్లా పాలేరు ఉప ఎన్నికలను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావును బరిలోకి దించింది. కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ రెడ్డి భార్య సుచరితా రెడ్డి బరిలోకి దిగారు.
ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాలేరు ఉప ఎన్నికలో తెరాస విజయం తథ్యమన్నారు. పాలేరులో తెరాస ఓడిపోతే తాను మంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధమని.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని బహిరంగ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు, బాధ్యత ఏమీ లేదని... ప్రతి ఎన్నికకు ఆ పార్టీ నేతలు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలేరులో సానుభూతి పేరుతో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పైగా, బద్ధశత్రువులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమై పోటీ చేస్తున్నాయని గుర్తు చేశారు.