షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. వివేకా హత్య కేసులో నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం షర్మిలకు ఎందుకని రోజా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రూపొందించుకున్న కుట్రలో షర్మిల ఒక అస్త్రంగా మారారని విమర్శించారు.
ఇందులో భాగంగానే నిర్దోషులపై బురద చల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత అన్న జగన్ను ఇబ్బంది పెట్టడమే మీ అసలైన లక్ష్యమన్నారు. వివేకాను తామే చంపామని చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చారని... వారికి బెయిల్ వచ్చేలా చేసి, నిరంతరం కాపాడుతూ, టీవీల్లో వారిని హీరోలుగా చూపిస్తున్నారని రోజా మండిపడ్డారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య జరిగిందని చెప్పారు. కేసును సీబీఐకి అప్పగించాలని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని చెప్పారని.. ఇప్పుడు అధికారంలో టీడీపీనే ఉన్నా తమపై పడి ఏడుస్తున్నారన్నారు.