1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (20:14 IST)

కరోనా పేషంట్లకు నిస్వార్థ సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే చెవిరెడ్డి సమీక్ష

తిరుపతి: కరోనా వేళ నిస్వార్థంగా సేవలు అందించిన అధికారులు, సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశంసించారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు, నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా బారిన పడిన నా ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించానని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫీవర్ సర్వే పట్ల దృష్టి సారించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి టెస్టులు చేయించాలని తెలిపారు.

పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఆత్మస్థైర్యం తో మెలగాలని, ధైర్యం చెప్పి భరోసా కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. దోమ కాటు కారణంగా మలేరియా వచ్చే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే పోలీస్ అధికారులను కోరారు. ప్రభుత్వ అనుమతులు పొంది రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆనందయ్య ప్రివెంటివ్ (పి) ఔషద మందును నియోజకవర్గ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

ప్రజల్లో ఈ ఔషదం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కోవిడ్ కేర్ సెంటర్ల అధికారులు మాట్లాడారు. చంద్రగిరి కోవిడ్ ఆసుపత్రి, కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా పేషంట్ల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే పద్మావతి నిలయం లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గాయని నోడల్ అధికారిని, తుడా సెక్రటరీ లక్ష్మీ పేర్కొన్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా అందిస్తున్న హోమ్ ఐసులేషన్ తదితర కిట్లు సకాలంలో అందిస్తున్నట్లు వివరించారు.  ఈ సమావేశంలో ఎంపిడిఓ లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.