1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 20 మే 2021 (15:30 IST)

రుయా ఆసుపత్రిలో మరణమృదంగం, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని విపక్ష నేతలు విమర్శించారు.

మరోవైపు ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనలో మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోతే... రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని చెపుతోందని టీడీపీ నేత పీఆర్ మోహన్ పిటిషన్ వేశారు. మోహన్ తరపున కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టులో వారు వాదించారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని విన్నవించారు. కేవలం ఆక్సిజన్ అందకే అంతమంది చనిపోయారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను ఇచ్చిందని... అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాటిని నెలకొల్పలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల తర్వాత తొలి రోజుకు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.