తెలంగాణాలో వైకాపా ఖాళీ : కారెక్కనున్న ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యే.. ఆపై తెరాసలో విలీనం
తెలంగాణా రాష్ట్రంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీకానుంది. గత ఎన్నికల్లో వైకాపాకు ఒక ఎంపీతో పాటు.. ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరంతా ఖమ్మం జిల్లా నుంచే విజయం సాధించారు. వీరిలో మదన్లాల్, తాటి వెంకటేశ్వర్లు గులాబీ కండువాలు కప్పుకొని కారెక్కేశారు. ఆ తర్వాత పార్టీకి మిగిలింది.. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాత్రమే.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాలమరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను అధికార తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సిట్టింగ్ ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావును అభ్యర్థిగా ప్రకటించిది. అలాగే, కాంగ్రెస్ పార్టీ రాంరెడ్డి వెంకట్రెడ్డి సతీమణి సుచరితారెడ్డిని బరిలోకి దించింది.
ఈమెకు వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని తెరాస అధినాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. దీనికి తోడు కృష్ణా డెల్టాకు తెలంగాణ అన్యాయం చేస్తోందని, పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 16, 17, 18 తేదీల్లో కర్నూలులో నిరాహార దీక్షకు దిగుతున్నట్లు జగన్ శనివారం ప్రకటించారు. ఇప్పటికే పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై గుర్రుగా ఉన్న టీఆర్ఎస్కు జగన్ దీక్షా ప్రకటన పుండు మీద కారం చల్లినట్లుగా మారింది.
దీంతో వైసీపీకి అంతకంటే ముఖ్యంగా జగన్కు షాక్ ఇవ్వాలని తెరాస నేతలు చకచకా పావులు కదిపారు. ఈ నేపథ్యంలో పొంగులేటితోపాటు, మిగిలిన మరో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైసీపీలో కొనసాగలేమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పొంగులేటి ఆదివారం పాలేరు ఉప ఎన్నికల తెరాస ఇన్చార్జ్, మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో కలిసి మంతనాలు సాగించారు. ఫాంహౌ్సలో ఉన్న సీఎం కేసీఆర్తోనూ పొంగులేటి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. వీరిమధ్య డీల్ సక్రమంగా కుదిరితే పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయంలు ఏక్షణమైనా కారెక్కే అవకాశం ఉంది.