బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (10:34 IST)

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

chandrababu
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ వేడుక సందర్భంగా జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు చొప్పన ఆర్థిక సాయం చేయాలని ఆదేసించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. 
 
అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!! 
 
విశాఖపట్టణం జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 300 రూపాయల టిక్కెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. 
 
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మంగళవారం అర్థరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టిక్కెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. 
 
ఆ వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోం మంత్రి అనిత, విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.