సివిల్స్ శిక్షకుడే హంతకుడు.. శ్రీమిత్ర హత్య కేసులో వీడిన మిస్టరీ
శ్రీమిత్ర హత్య కేసులోని మిస్టరీ వీడింది. సివిల్స్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ ఇచ్చే వ్యక్తే హంతకుడిగా గుర్తించారు. ఓ కోచింగ్ సెంటర్లో రెండు సీట్లు ఇప్పిస్తానని రూ.50 వేలు తీసుకున్నాడు.
శ్రీమిత్ర హత్య కేసులోని మిస్టరీ వీడింది. సివిల్స్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ ఇచ్చే వ్యక్తే హంతకుడిగా గుర్తించారు. ఓ కోచింగ్ సెంటర్లో రెండు సీట్లు ఇప్పిస్తానని రూ.50 వేలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా.. సీట్లు ఇప్పించకపోవడాన్ని ప్రశ్నించడంతో శ్రీమిత్రను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 9వ తేదీన జరిగిన కృష్ణానగర్కు చెందిన శ్రీమిత్ర హత్యకు గురైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
శ్రీమిత్ర తన అక్క కూతుళ్లకు ఏస్ అకాడమీలో ట్రాన్స్కో, జెన్కో పోస్టుల పరీక్షకు కోచింగ్ ఇప్పించడానికి స్నేహితుడైన పవన్ను సంప్రదించాడు. శిక్షణ కోసం డబ్బు తగ్గించాలని అతడిని కోరాడు. పవన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సందీప్రెడ్డిని పరిచయం చేశాడు. శ్రీమిత్ర కోచింగ్ కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు సందీప్రెడ్డికి అందజేశాడు.
రాకేష్ తన స్నేహితుడు వెంకటేశ్కు అదే ఏస్ అకాడమీలో గేట్ కోచింగ్ కోసం రూ.40 వేలు సందీప్ రెడ్డికి ఇచ్చాడు. సీట్లు ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వమని సందీప్రెడ్డిపై శ్రీమిత్ర ఒత్తిడి తెచ్చింది. వీరిమధ్య వివాదం జరిగింది. సందీప్రెడ్డి తన వద్ద ఉన్న కత్తితో శ్రీమిత్ర మెడ కుడివైపు పొడిచాడు.
తీవ్ర రక్తస్రావం జరగడంతో సందీప్రెడ్డి సమీపంలో ఉన్న మెడికల్ హాల్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశాడు. పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. మార్గమధ్యంలో శ్రీమిత్ర మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు సందీప్రెడ్డిని నల్లగొండ బస్టాండ్లో సోమవారం అరెస్టు చేశారు.