శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (22:04 IST)

స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?

విద్యాబుద్థులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వికృత చేష్టలకు దిగారు. విద్యార్థులు పెడదారిన వెళితే వారికి సక్రమమార్గంలో తీసుకెళ్ళాల్సిన గురువులే దాష్టీకానికి దిగారు. అర్థనగ్నంగా విద్యార్థులను మండుటెండలో కూర్చోబెట్టి విద్యార్థులను మానసికంగా హింసించారు. తల్లి, తండ్రి తరువాత గురువు అన్న గొప్ప పదానికి అర్థాన్నే మార్చేశారు.  
 
తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువుకు మూడవ స్థానం ఇచ్చారంటే గురువులు ఎంత గొప్పవారో చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుత విద్యావ్యవస్ధలో గురువులు వికృత చేష్టలకు దిగుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్ళాల్సిన ఉపాధ్యాయులు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. 
 
ఇప్పటివరకు విద్యార్థులను ఉపాధ్యాయులు వాతలు పెట్టడం.. గట్టిగా చేతులపై కొట్టడం లాంటివి చూశాం. కానీ తాజాగా జరిగిన సంఘటన అందుకు పూర్తి విరుద్ధం. విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వచ్చినా లేకుంటే హోంవర్క్ రాయకున్నా నిర్థాక్షణ్యంగా బట్టలు ఊడదీసి తరగతి గది ముందు నిలబడతారు. అది ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా పుంగనూరులోని చైతన్య భారతి పాఠశాలలో. 
 
ఈ తతంగాన్ని ఒక యువకుడు తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను మీడియాకు అందించారు. ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోని ఉపాధ్యాయులు తరగతి గది బయట నగ్నంగా మండుటెండలో కూర్చోబెట్టారు. ఉపాధ్యాయుల వింత పోకడలపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 
 
ఉపాధ్యాయుల వ్యవహారంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సీరియస్ అయ్యారు. విచారణ అధికారిగా ఎంఈఓను నియమించారు. వెంటనే విచారణ చేపట్టిన ఎంఈఓ విద్యార్థులకు చిత్ర హింసలకు గురి చేసిన విషయం వాస్తవమేనని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులపై జరుగుతున్న ఇలాంటి వికృత క్రీడలు మానాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నంఘాల నేతలు. చైతన్య భారతి స్కూల్ యాజమన్యంతో పాటు ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలంటున్నారు.