1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (13:29 IST)

వైకాపాకు షాక్ : తాడిపత్రి మున్సిపాలిటీ తెదేపా కైవసం

అధికార వైకాపాకు షాక్ తగిలింది. ఎంతో ఉత్కంఠ రేపిన అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక అనూహ్య పరిణామాల మధ్య తెదేపా కైవసం చేసుకుంది. పురపాలిక ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. 
 
తెదేపాకు ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికితోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూడు రోజుల కిందట ఎమ్మెల్సీల ఎక్స్‌అఫీషియో ఓట్లను మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించిన నాటి నుంచి ఈ ఛైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది. ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
కాగా, తాడిపత్రి పురపాలికలోని 36 వార్డుల్లో రెండు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. తెదేపా 18, వైకాపా 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. ముందు నుంచే సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు తెదేపాకు అనుకూలంగా ఉన్నారు. 
 
వైకాపాకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం 18కి చేరింది. తెదేపా తరపున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో తెదేపా సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ దీపక్‌ రెడ్డి ఓటును తిరస్కరించారు. అయినప్పటికీ.. తెదేపా ఇతరు సహాయంతో విజయం సాధించింది.