1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (11:54 IST)

వంగవీటి రాధా హత్యకు రెక్కీపై సమగ్ర విచారణకు చంద్రబాబు డిమాండ్

తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధా స్వయంగా ప్రకటించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో సమగ్ర విచారణ ద్వారా తేలే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేసమయంలో వంగవీటి రాధాకు ఏం జరిగినా ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. 
 
ఏపీలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా, భయనంకరంగా దిగజారిపోయివున్నాయని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలు ఆటవిక పాలను తలపిస్తున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 
 
గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి రాధ
బెజవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాకు ప్రభుత్వం కల్పించిన 2+2 గన్‌మెన్లను ఆయన తిరస్కరించారు. తనకు గన్‌మెన్ల భద్రత అక్కర్లేదనీ, ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పారు. 
 
తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా తన తండ్రి వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు 2+2 చొప్పున గన్‌మెన్లతో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 
 
దీనిపై వంగవీటి రాధా స్పందించారు. తాను నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తినని, ప్రభుత్వం గన్‌మెన్లు వద్దని చెప్పానని చెప్పారు. తనకు ప్రజలు, అభిమానులే రక్షణ అని స్పష్టంచేశారు. 
 
హత్యకు రెక్కీ నిర్వహించారని తాను వెల్లడించిన తర్వాత అన్ని పార్టీల నేతలు ఫోనులో పరామర్శించారని తెలిపారు. కానీ, ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని చెప్పారు. 
 
అదేసమయంలో తనను పోలీసులు తనను సంప్రదిస్తే పూర్తి సమాచారం అందిస్తానని, పోలీసులకు కూడా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే రెక్కీకి సంబంధించి తన వద్ద కంటే పోలీసుల వద్దే పూర్తి సమాచారం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు.