శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 20 నవంబరు 2021 (13:20 IST)

సీతమ్మలాంటి భువనేశ్వరిని అవమానించారు...ఉయ్యూరులో నిర‌స‌న‌

దేవాలయంలాంటి అసెంబ్లీని కౌరవ సభ లాగా చేసి, సీతమ్మలాంటి భువనేశ్వరిని అవమానించిన వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పద‌ని, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ హెచ్చ‌రించారు. ఉయ్యూరు ప్రధాన కూడలి వద్ద జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీ, రోజా పోస్టర్లు తగులబెట్టిన రాజేంద్ర ప్రసాద్, ఇతర టీడీపీ నాయకులు వైసీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.
 
 
ఉయ్యూరు పట్టణ, మండల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఈ నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించారు. అసెంబ్లీలో భువనేశ్వరికి అవమానం చేశార‌ని, చంద్రబాబు కన్నీటికి బదులు చెపుతామ‌ని పేర్కొన్నారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, అన్న నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వైసీపీ నాయకులకు పుట్టగతులు ఉండవని, వారి సిగ్గు,సెరంలేని మాటలతో పార్టీలకు అతీతంగా ఆంధ్ర  రాష్ట్ర మహిళా లోకం మొత్తం మనోవేదనతో ఉంద‌న్నారు. ముఖ్యమంత్రి కేవలం బాబాయ్ గొడ్డలి వేటుని ప‌క్కత్రోవ పట్టించడానికే ఈ నాటకాలు ఆడిస్తున్నాడని, అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన సొంత తల్లిని, చెల్లిని  ప్రక్క రాష్ట్రాలకు వెల్లగొట్టిన సంస్కృతి జ‌గ‌న్ ది అని అన్నారు. 
 
 
రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు  ఏం న్యాయం చేస్తార‌ని, ఎన్నో గెలుపోటములు, ఓడుదుడుకులు చూసిన  చంద్ర‌బాబు కంట కన్నీరు పెట్టించి సైకో ఆనందం పొందుతున్నార‌ని ఆరోపించారు. మీరు మట్టికొట్టుకు పోవడం ఖాయమని, చంద్రబాబు చూడని పదవులు, అధికారాలు లేవ‌ని, కేవలం ఆంధ్ర రాష్ట్ర, మన బిడ్డల భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తాపత్రేయం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
 
 
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షులు గుర్నాధరావు, కుటుంబరావు, పిచ్చిరెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ యువత అధ్యక్షులు చౌదరి, జబర్ల పూడి సర్పంచ్ ప్రసాద్, సాయిపురం సర్పంచ్ బాషా, కౌన్సిలర్స్  పండ్రాజు సుధారాణి, పలియాల శ్రీను ఉయ్యూరు మండల గ్రామాల, పట్టణ పార్టీ అధ్యకులు, కార్యదర్శులు పాల్గొన్నారు.