1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:27 IST)

చేరుతున్నట్టు 'గంట' మోగించారు? - ముహూర్తం ఫిక్స్!!

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మరోమారు పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస రావు త్వరలోనే అధికార వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
నిజానికి గంటా పార్టీ మారుతున్నట్టు గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందులోభాగంగానే, ఆయన గుట్టుచప్పుడు కాకుండా వైసీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఆయన పార్టీ మార్పుపై విస్తృతంగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఆయన ఎక్కడాకూడా స్పష్టత ఇవ్వలేదు. 
 
తొలుత ఆగస్టు 15వ తేదీ అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి 16వ తేదీని ఫిక్స్ చేశారు. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగగా, ఆయన వర్గానికి చెందిన నేతలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి.
 
గంటా శ్రీనివాస రావు తెదేపాకు స్వస్తి చెప్పి వైకాపాలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి, గంటా ప్రత్యర్థి అవంతి శ్రీనివాస్ స్పందించారు. చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి దారిలో పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నిస్తున్నారని అవంతి ఆరోపించారు. వైసీపీలో చేరేందుకు ముహూర్తాలు, లీకులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
 
గంటా చేసిన భూ కుంభకోణాలపై గతంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారని అవంతి గుర్తుచేశారు. ఈ అంశంపై సిట్‌తో విచారణ కూడా చేయించారని చెప్పారు. భూ కుంభకోణం, సైకిళ్ల స్కామ్‌పై తాను, విజయసాయి రెడ్డి ఇప్పటికే మాట్లాడామని తెలిపారు. పార్టీలో గంటా చేరేది, లేనిది అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.