శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (12:39 IST)

టీడీపీ ఎంపీలకు జాక్‌పాట్... పెద్దపీట వేస్తున్న కేంద్రం!!

tdplogo
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు జాక్‌పాట్ తగిలింది. పార్లమెంట్ కీలక కమిటీల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. అనేకమంది ఎంపీలకు పార్లమెంట్ కీలక కమిటీల్లో చోటుకల్పిస్తుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎంపీలకు పార్లమెంట్‌కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటుదక్కింది. 
 
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలో పార్థసారథి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే, టీడీపీకి ఒక మంత్రిత్వ స్థాయి సంఘం చైర్మన పదవి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 
 
ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే సర్కారు మనుగడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లపై ఆధారపడివున్న విషయం తెల్సిందే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు.