కేసీఆర్ 15 నెలల ఒక్కరోజు మాత్రమే సీఎంగా..?: కొత్తకోట దయాకర్ రెడ్డి
తెలంగాణ సర్కారుతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్లపై తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్. రమణ, దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిందని రమణ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ డిప్యూడీ సీఎం రాజయ్యను తొలగించినంత మాత్రాన అవినీతి ప్రక్షాళన జరగదన్నారు.
ఇక కేసీఆర్ 15 నెలల ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కొత్తకోట దయాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. దళితులు ముఖ్యమంత్రి అయితే అవినీతికి పాల్పడుతారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించడమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
స్వైన్ఫ్లూను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దళితుడైన రాజయ్యను బలిచ్చారని దానం నాగేందర్ విమర్శించారు. రాజయ్యను ఇరికించి కేసీఆర్ తన తప్పును దాచుకోవాలని చూస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ను, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తప్పుదోవ పట్టించారని అన్నారు. స్వైన్ఫ్లూ వ్యాధిపై సోమేష్ సీఎంకు తప్పుడు నివేదికలు ఇచ్చాడని ఆరోపించారు. స్వైన్ ఫ్లూతో నష్టం రాదని చెప్పడంతో రాజయ్య కొంత అలసత్వం చూపి ఉండవచ్చునని అన్నారు.