గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (11:09 IST)

ఆస్తి కోసం ఓ భర్త దారుణం.. భార్యాబిడ్డను పీకపిసికి చంపేసి.. కిరోసిన్ పోసి...

ఆస్తి కోసం ఓ భర్త అత్యంత కిరాతకంగా నడుచుకున్నాడు. భార్యాబిడ్డను పీకపిసికి చంపేసి, ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తాను చేసిన హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కసర్‌గుత్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని బెజుల్‌వాడికి చెందిన కవిత(28)కు కసర్‌గుత్తికి చెందిన చింతకి వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని పదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, మద్యానికి బానిస అయిన వెంకట్ రెడ్డి తరచూ భార్యను వేధించసాగాడు. పైగా, తమకున్న ఐదెకరాల్లో ఎకరా భూమిని ఇటీవల వెంకట్‌రెడ్డి అమ్మి జల్సాకు ఖర్చుచేసేశాడు. దీన్ని గమనించిన కవిత ఉన్న నాలుగు ఎకరాలు కూడా భర్త అమ్మేసి దుబారా చేస్తాడన్న భయంతో  పెద్దలను ఆశ్రయించి వారి సాయంతో తన పేరున పట్టా చేయించుకుంది.
 
అయితే, మద్యంతో పాటు.. వ్యసనాలకు బానిస అయిన వెంకట్ రెడ్డి.. ఆ నాలుగు ఎగరాల భూమిని కూడా విక్రయించేందుకు ప్రయత్నించగా, భార్య కవిత అడ్డుకుంది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఇందులోభాగంగా, భార్యతో పాటు.. నాలుగేళ్ళ కుమారుడిని పీకపిసికి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా గ్రామంలో కలియతిరిగాడు. రాత్రికి ఇంటికి చేరుకుని మృతదేహాలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 
 
ఆ తర్వాత తన భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారంటూ బోరున విలపించసాగాడు. అయితే, గ్రామవాసులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారించగా, అసలు విషయం వెల్లడించాడు.