1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (17:55 IST)

దారిదోపిడీ దొంగల్లా ఏసీబీ అధికారులు..పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

అవినీతి నిరోధక శాఖ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారు అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 
ఏసీబీ అధికారుల పనితీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎపిసోడ్‌పై మాట్లాడారు.

లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? అని ఫైర్ అయ్యారు. అవినీతిని అరికట్టాల్సిన వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణం అన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని ఏసీబీ చీఫ్‌కు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. 
 
ఏపీపీఎస్సీ నుంచి నియామకమైన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని తెలిపారు.
 
అసలేం జరిగిందంటే...
ఈనెల 9వ తేదీన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆ సందర్భంగా లెక్కల్లో లేని రూ.61,500 నగదును గుర్తించారు.

దీంతో సబ్ రిజిస్ట్రార్ తారకేశుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆయనను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ సబ్ రిజిస్ట్రార్ తారకేశు.. రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారు.

ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని లేఖకు అనుసంధానంగా పంపించారు. దీనిని పరిశీలించిన డిప్యూటీ సీఎం.. అది అక్రమ కేసు అని నిర్థారించుకున్నారు. ఏసీబీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తప్పుడు పద్దతుల్లో వెళ్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీబీ చీఫ్‌కు సుభాష్ చంద్రబోస్ లేఖ రాశారు. అంతేకాదు.. ఏసీబీ అధికారులతో కుమ్మక్కైన విశాఖ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.