శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (06:56 IST)

పోలీసుల మానవత్వం.. మృతదేహానికి అంత్యక్రియలు

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూస్తూ, కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా చేయడంలో మొదటినుండి పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కరోనా వైరస్ కి, ప్రజలకు మధ్య పోలీసులు అడ్డుగోడలా నిలబడి సేవలు అందిస్తున్నారు. వారి సేవల గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కట్టడిలోనే కాదు.. మానవత్వం చూపించడంలోనూ పోలీసులు ముందుంటున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు.
 
నాగాయలంక ఎస్ ఐ గొప్ప మనసు 
తాజాగా కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక పోలీసులు మానవత్వం చూపించారు. కరోనా లక్షణాలతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను వారే దగ్గరుండి నిర్వహించారు.

కరోనా భయంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సైతం భయపడితే, ఆ కార్యక్రమం నిర్వహించడానికి నాగాయలంక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న చల్లా కృష్ణ ముందుకు వచ్చారు.

ఆయనతో పాటు స్వచ్ఛ నాగాయలంక కార్యకర్తలు అయిన తలశిల రఘుశేఖర్, నారాయణ, డి.టీ సుబ్బారావు లు కలిసి ఎవరు ముట్టుకోవడానికి సాహసించని మృతదేహాన్ని ఇంటి నుండి బయటకు తీసుకుని వచ్చి, స్మశాననికి తీసుకుని వెళ్లి స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందితే ఎవరూ కూడా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. మృతదేహానికి కరోనా ఉందేమో, దాని దగ్గరకు వెళితే తమకు కూడా కరోనా సోకుటుందేమో అనే భయంతో మృతదేహం వద్దకు వెళ్ళడానికి కుటుంబసభ్యులు కూడా సాహసించలేకపోయారు.

ఆ చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందొ లేదో తెలియదు కానీ, అటువంటి వ్యక్తి మృతదేహానికి అంతిమ సంస్కారం చేసినందుకు మనసు తృప్తిగా ఉందని ఎస్ఐ చల్లా కృష్ణ తెలిపారు. అంతిమ సంస్కారానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మానవత్వం చూపి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన నాగాయలంక ఎస్ ఐ చల్లా కృష్ణను, స్వచ్ఛ నాగాయలంక సభ్యులను అందరూ మెచ్చుకుంటున్నారు.