1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (10:03 IST)

నంద్యాలలో పులి పిల్లలు.. పెద్దపులి కోసం డ్రోన్ కెమెరాలతో..?

Cubs
Cubs
నంద్యాలలో పులి పిల్లలు కనిపించిన సంగతి తెలిసిందే. పెద్దపులి అయిన తల్లిపులిని వెతికే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు. బుధవారం తెల్లవారుజామున నల్లమలలో వరుసగా మూడో రోజు నంద్యాల జిల్లాలో తన పిల్లలను విడిచిపెట్టిన తల్లి పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ముసలి మడుగు, గుమ్మడాపురం బీట్లలో 100 మందితో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పులి కోసం వేట సాగుతోంది. మరోవైపు కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం బీట్‌ పరిధిలో నాలుగు పిల్లల తల్లి పులిని అటవీశాఖ అధికారులు గుర్తించి 108వ పులిగా గుర్తించారు. 
 
తల్లి పులి వయస్సు దాదాపు 8 ఏళ్లు ఉంటుందని, పులి నంబర్ 108గా గుర్తించామని అధికారులు తెలిపారు. పిల్లలు కనిపించిన ప్రాంతంలో తల్లి పులి గర్జనలు వినిపించాయని, వాటి కోసం గాలిస్తున్నామని సిబ్బంది వెల్లడించారు. 
 
పిల్లలకు దూరంగా ఉన్న తల్లి పులి ప్రవర్తనను ఊహించలేమని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో ముళ్ల పొదల్లో నాలుగు పులి పిల్లలను స్థానికులు గమనించిన విషయం తెలిసిందే. 
 
నాలుగు పులి పిల్లల గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పులి పిల్లలను ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత పులి పిల్లల తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు వెతికారు.
 
అయితే రెండు రోజులు గడిచినా పులి జాడ లేకపోవడంతో పెద్ద గుమ్మడాపురం గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.