శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:12 IST)

ఏపీ దేవాదాయ శాఖకు టీటీడీ డబ్బు తరలింపు

ఏపీ దేవాదాయ శాఖకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఏటా రూ.50 కోట్లు ఏకమొత్తం కింద చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

అందులో నుంచి దేవాదాయ శాఖ పరిధిలోని సర్వ శ్రేయో నిధి(సీజీఎఫ్‌)కి రూ.40 కోట్లు, అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూఎఫ్‌)కి రూ.5 కోట్లు, దేవాదాయ పరిపాలక నిధి(ఈఏఎఫ్‌)కి రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తారు.
 
ఇప్పటివరకు 1987 దేవాదాయశాఖ చట్టం ప్రకారం తితిదే సీజీఎఫ్‌కు ఏటా రూ.1.25 కోట్లు, ఏడబ్ల్యూఎఫ్‌, ఈఏఎఫ్‌లకు చెరో రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.2.25 కోట్లు చెల్లిస్తోంది. 
 
రాష్ట్రంలో జాయింట్‌ కమిషనర్‌ కేడర్‌ కలిగిన ఇతర దేవాలయాలు తితిదే కంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
శ్రీశైలం దేవస్థానం ఏటా రూ.30 కోట్లు చెల్లిస్తోంది. తితిదే ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. నలుగురు అధికారిక సభ్యులతో ధార్మిక పరిషత్‌ విధులు నిర్వహించేలా మరో ఆర్డినెన్స్‌ జారీ జారీ చేసింది.
 
 నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్‌లో నలుగురు అధికారిక సభ్యులు, వివిధ రంగాలకు చెందిన 17 మంది అనధికార సభ్యులు ఉంటారు.
 
 ప్రస్తుతం పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ లేకపోవడంతో... అది నిర్వహించాల్సిన విధులకు అడ్డంకులు లేకుండా నలుగురు అధికార సభ్యులతో ఏర్పాటు చేసేలా  ఆర్డినెన్స్‌ జారీ చేసింది.