1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (21:18 IST)

ఎంట‌ర్‌టైన్‌మెంట్ సిటీగా విశాఖ నగరం

విశాఖపట్నం నగరాన్ని పర్యాటకపరంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపధ్యంలో విశాఖను ఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులతో సోమ‌వారం సమీక్షించారు.

ఇప్పటికే విశాఖపట్నం నగరం పర్యాటక పరంగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తుండగా దానిని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దానిలో భాగంగా ముఖ్యంగా విశాఖనగరంలో బీచ్ కారిడార్ అభివృద్ధి,భీమిలి నుండి భోగాపురం వరకూ బీచ్ కారిడార్ అభివృద్ధి చేయడం,7స్టార్ హోటల్స్,గోల్ప్ కోర్సు వంటివి ఏర్పాటు,ఎడ్వంచర్ మరియు వాటర్ స్పోర్ట్సు వంటివి అభివృద్ధి చేయడం పై సిఎస్ సమీక్షించారు.

అలాగే జెట్టీ,బీచ్ వాటర్ స్ట్రక్చర్ల నిర్మాణం,సీప్లేన్ లు,క్రూయిజ్ షిప్పులు,అమ్యూజ్మెంట్ పార్కు,యాంపీ ధియేటర్,రిటైల్ అవులెట్స్ వంటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన అంశాలపై డా.సమీర్ శర్మ అధికారులతో చర్చించారు.

అదే విధంగా స్కై టవర్,టన్నల్ అక్వేరియం,శిల్పారామం,5స్టార్ హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్ వంటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చర్చించారు. సమావేశంలో రెవెన్యూ, పర్యాటక, యువజన సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, సమాచారశాఖ కమిషనర్ మరియు రాష్ట్ర రేడియో, టివి అండ్ ఫిలిమ్ డెవల‌ప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి టి.విజయ్‌కుమార్ రెడ్డి, ఇఏ టు సిఎస్ పి.ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.