1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 మే 2020 (20:33 IST)

ఎల్.జీ.పాలిమర్ కంపెనీ పనైపోయింది, కానీ..

విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. గ్యాస్‌ను పీల్చిన జనం రోడ్లపై కిందపడిపోయారు. ఇక చెట్లయితే మాడి మసైపోయాయి. వందలాది జంతువులు చనిపోయాయి. ఈ ఘటన స్థానికంగా ఉన్న వెంకటాపురం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విషాదాన్నే నింపింది.
 
అయితే ఎల్.జి.పాలిమార్ ఫ్యాక్టరీని పూర్తిగా అక్కడ నుంచి తరలించాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల 20వేల మంది జనం నివాసముంటున్నారు. నీటి కాలుష్యం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువే. ప్రస్తుతం జరిగిన సంఘటనతో కనీసం నీళ్ళు తాగాలన్నా భయపడిపోతున్న పరిస్థితి స్థానికుల్లో ఏర్పడింది.
 
జరిగిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు డిజిపి గౌతమ్ సవాంగ్ కూడా ఘటనపై విచారణ జరిపించేందుకు.. ఎల్.జి.పాలిమర్ కంపెనీతో మాట్లాడేందుకు వచ్చారు. అయితే వెంకటాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ తరలించాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
 
ఎల్.జీ.పాలిమర్ కంపెనీని అక్కడి నుంచి తరలిస్తారా లేదా అన్నది ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. అయితే  కంపెనీని మూసివేస్తేనే గ్రామస్తులకు ఎంతో సేఫ్ అన్న భావన అక్కడివారందరూ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎల్.జీ.పాలిమర్ కంపెనీని ఉన్న ప్రాంతంలో మూసివేసి వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనలో సీఎం జగన్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ముఖ్యమంత్రికి దీనిపై ఒత్తిడి వస్తున్నట్లు కూడా తెలుస్తోందట. అయితే ప్రజల ప్రాణాలే ముఖ్యమని నిర్ణయించుకున్న సిఎం ఫ్యాక్టరీని తరలించేందుకే ఎక్కువ మ్రొగ్గు చూపే అవకాశాలున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.