1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:53 IST)

రాజమండ్రిలోది ఏం పోలీస్ స్టేషనబ్బా?..

సీఎం జగన్మోహన్‌ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన పోలీసు స్టేషన్‌ను ‘దిశ పోలీస్‌ స్టేషన్‌’గా పరిగణించాలా? మహిళా పోలీస్‌ స్టేషన్‌గా పరిగణించాలా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

దీనికి ప్రధాన కారణం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి, అసెంబ్లీలో నెగ్గించుకున్న.. మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు, వారికి ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారకపోవడమే!

ఈ నేపథ్యంలో దిశ బిల్లులోని నిబంధనల ప్రకారం పోలీసు స్టేషన్లు ప్రారంభిస్తే అవి ఏ చట్టం ప్రకారం అవి పనిచేస్తాయనేది కీలక ప్రశ్న. ఇక, కేంద్రానికి పంపిన ఏ బిల్లుకైనా రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇస్తేనే అది చట్టంగా మారుతుంది.

కానీ, దిశ బిల్లుకు ఇప్పటివరకు రాష్ట్రపతి రాజముద్ర పడలేదు. రాష్ట్రపతి నుంచి ఆమోదం లేనిదే ఆ బిల్లులోని అంశాలను అమలు చేసే అవకాశం ఉండదు.

గతంలో ఏసీబీ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు సమయంలోనూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాకే కోర్టులు ఏర్పాటు చేశారు. తాజాగా దిశ చట్టంపై కొన్ని క్లారిఫికేషన్లు కోరుతూ కేంద్రం ఆ చట్టాన్ని ఏపీకి పంపింది.

దాన్ని సవరించిన ఏపీ తిరిగి కేంద్రానికి పంపింది. కేంద్రం పరిధిలోని ఐసీపీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును రూపొందించింది.

అవి అన్ని రాష్ట్రాలకూ సంబంధించినవి కాబట్టి కేంద్రం తిరిగి వెనక్కి పంపుతుందా? లేదా ఐపీసీ చట్టానికి అనుబంధ చట్టంగా దీన్ని పరిగణిస్తుందా? అనే సందేహంపై స్పష్టత లేదు.

ఐపీసీ, సీఆర్‌పీసీలోని సెక్షన్లను ఏపీ ప్రభుత్వం సవరించింది, అలా కాకుండా దిశ చట్టంకోసం కొత్త సెక్షన్లు ప్రతిపాదించి ఉంటే దాన్ని ఏపీ వరకు ఐపీసీ చట్టానికి అనుబంధ చట్టంగా పరిగణించే అవకాశం ఉండేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

మహిళల రక్షణకు సంబంధించిన బిల్లు కాబట్టి కేంద్రం ఇవ్వాలనుకుంటే ఏపీ వరకు ఈ చట్టం అమలుకు అనుమతిచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.