1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 3 జులై 2021 (12:51 IST)

శ్రీశైలం మ‌ల్ల‌మ్మ క‌న్నీరు వెనుక గుంత‌, త‌వ్విందెవ‌రు?

శ్రీశైలంలో పేరొందిన హేమారెడ్డి మల్లమ్మ దేవాల‌యం వెనుక ఎవ‌రో పెద్ద గుంత తవ్వారు. మ‌ల్ల‌మ్మ కన్నీరు వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ గుంతను త‌వ్వ‌నట్టు సమాచారం. శ్రీశైల దేవస్థాన అధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.

మ‌ల్ల‌మ్మ క‌న్నీరు వెనుక ఉన్న ఒక పాడుబ‌డిన‌ కొట్టంలో ఈ గుంతను త‌వ్వారు. గ‌త కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ కొట్టంలో ఒక నాటు వైద్యుడు నివాసమున్నట్లు స్థానికులు చెపుతున్నారు. ఆ త‌ర్వాత చాలా కాలంగా ఈ కొట్టంలో ఎవరు కూడా నివాసం ఉండటం లేదని తెలుస్తోంది. ఈ గుంత‌ను ఎవ‌రు ఎందుకు త‌వ్వార‌నేది అధికారుల‌కు సైతం అంతుచిక్క‌డం లేదు.

ఈ విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ గుంత‌ను శ్రీశైలం దేవ‌స్థానం కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామారావు తో పాటు రెండవ పట్టణ పోలీస్ సబ్ఇన్ స్పెక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీబాలకృష్ణ, ప్రచురణల విభాగం సంపాదకుడు డా.సి.అనిల్ కుమార్, పర్యవేక్షకులు  ఎన్. శ్రీహరి, దేవస్థానం భద్రతా అధికారి నరసింహరెడ్డి, సహాయ స్థపతి జవహర్ తదితరులు ప‌రిశీలించారు.
 
ఏదైనా నిధులు నిక్షేపాల కోసం త‌వ్వారా?  లేక పురాత‌న క‌ట్ట‌డాలు, విగ్ర‌హాలు దొరుకుతాయ‌ని త‌వ్వారా అనేది ఇంకా విచార‌ణ‌లో తేలాల్సి ఉంది. పురాత‌న ఆల‌యాలు, చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ర‌హ‌స్య త‌వ్వ‌కాలు చేయ‌డం గ‌త కొంత కాలంగా వివిధ ముఠాల‌కు ప‌రిపాటిగా మారింది. ఈ కోణంలో ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని స్థానికులు పేర్కొంటున్నారు.