శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 14 మే 2019 (21:43 IST)

అమరావతికే మకాం మార్చేస్తోన్న జగన్.. ఎందుకుంటే..?

ఫలితాలకు ఇక తొమ్మిదిరోజుల సమయం మాత్రమే ఉంది. గెలుపు ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సర్వేలు అనుకూలంగా వస్తే ఇక విజయం మాదేనన్న ధీమాతో ఉన్నాయి. ఇక జగన్ అయితే ఏకంగా తన ప్రభుత్వంలో ఐఎఎస్‌లు ఎవరిని నియమించాలన్న నిర్ణయంలో కూడా ఉన్నారట. తాజాగా వైసిపి తన కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చేస్తోంది.
 
ప్రధానంగా వైసిపి కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పార్టీని తెలంగాణా రాష్ట్రంలో కూర్చుని పార్టీ కార్యకలాపాలను సాగించడం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. అయితే అదేదీ పట్టించుకోని జగన్ తాను మాత్రం లోటస్‌పాండ్‌నే వేదికగా చేసుకుని ముందుకు వెళ్ళేవారు.
 
కానీ ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ముందుగానే జగన్ అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని నిర్ణయించేసుకున్నారు. ఇప్పటికే లోటస్‌పాండ్ నుంచి సామగ్రి మొత్తాన్ని షిఫ్ట్ చేయడం ప్రారంభించారు. ఒక్కొక్కటిగా ఫర్నిచర్‌ను తీసుకెళుతూ ఈ నెల 21వ తేదీలోగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్న నిర్ణయానికి జగన్ వచ్చేశారట. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పార్టీకి సంబంధించిన వ్యవహారాలను హైదరాబాద్‌కు వెళ్ళి చక్కదిద్దితే బాగుండదన్న నిర్ణయానికి వచ్చారట జగన్. అందుకే హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు.