శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (13:03 IST)

ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిందో భార్య. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దడిగా గ్రామానికి చెందిన జనగాం వీరయ్య (47), భాగ్యశ్రీ (32) అనే దంపతులు ఉన్నారు. వీరయ్య డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తుంటే, ఆయన భార్య అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అదే కంపెనీలో పని చేస్తే రానా అనే వ్యక్తితో భాగ్యశ్రీకి పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న వీరయ్య.. భార్యను మందలించి.. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భాగ్యశ్రీ.. తన ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, ఈ యేడాది అక్టోబరు 10వ తేదీన మద్యంతాగి ఇంటికి వచ్చిన వీరయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో వీరయ్య నిద్రపోయాక భాగ్యశ్రీ తన ప్రియుడు రానాను పిలిచింది. ఇద్దరూ కలసి అతని నెత్తిపై రోకలిబండతో మోది హత్య చేశారు. అనంతరం ప్రియుడు రానాతో కలిసి ఆమె పరారైంది. 
 
రెండ్రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగన అధికారులు కుళ్లిపోయిన స్థితిలో వీరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యగా కేసు నమోదుచేసిన పోలీసులు 2 నెలల పాటు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో భాగ్యశ్రీ, రానా మల్లాపూరులో ఉండగా గుర్తించి అరెస్టు చేశారు.