1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (21:29 IST)

ప్రియుడు గ్రామ వాలంటీర్.. అంతే అతడి సాయంతోనే భర్తను చంపేసింది..

నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళా గ్రామ వాలంటీర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి జాతీయ రహదారిపై పడేశారు. ఆపై ఆమె ఏమీ ఎరగనట్లు నటించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు బండారం బయటపడక తప్పలేదు.
 
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోవూరులో బండికాల రవీంద్ర-సమత అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. రవీంద్ర అల్లూరు మండలంలోని ఓ చర్చికి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. సమత కోవూరులోని శాంతినగర్-2 ప్రాంతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది.
 
కొంతకాలంగా రాము అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ఇంట్లో లేనప్పుడు అతన్ని ఇంటికి పిలిపించుకునేది. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి రామును ఇంటికి పిలిపించుకుంది. భర్త ఇంట్లో లేకపోవడంతో అతనితో ఏకాంతంగా గడిపింది. 
 
అయితే భర్త కంట్లో పడింది. ఆగ్రహంతో భార్య సమతను నిలదీశాడు. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని సమత, రాము ఆందోళన చెందారు. ఇద్దరు కలిసి రవీంద్ర ముఖంపై గట్టిగా దిండు అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి అతన్ని హత్య చేశారు. ఆపై జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయారు. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి.  
 
అలాగే ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందాడని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సమతను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రియుడు రాముతో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో సమత,రాములపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.