బస్సు దిగుతుండగా ప్రసవం... చివరి మెట్టుపై శిశువు... పుట్టుకతోనే బిడ్డ.. ఆస్పత్రిలో తల్లి మృతి!
నెల్లూరు జిల్లా కావలిలో ఓ నిండు గర్భిణి బస్సు దిగుతుండగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డ బస్సు ఫుట్బోర్డు చివరి మెట్టుపై పడగా, ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, తల్లి కూడా ప్రాణాలు విడిచింద
నెల్లూరు జిల్లా కావలిలో ఓ నిండు గర్భిణి బస్సు దిగుతుండగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డ బస్సు ఫుట్బోర్డు చివరి మెట్టుపై పడగా, ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన సోమవారం జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కావలి రూరల్ మండలం నడింపల్లికి చెందిన గిరిజన మహిళ అంకమ్మ (20)కు జలదంకి మండలం తొమ్మిదోమైలుకు చెందిన జయంపు పెంచలయ్యతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ ఆత్మకూరులో నివాసముంటూ అక్కడే చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు.
నిండుగర్భిణిగా ఉన్న అంకమ్మ సోమవారం వారి పుట్టింటికి వెళ్లాలని భర్తతో కలిసి ఆత్మకూరులో బస్సు ఎక్కింది. కావలిలో బ్రిడ్జిసెంటర్లో బస్సు దిగుతున్న సమయంలో ఆమెకు తెలియకుండానే గర్భసంచిలో నుంచి చనిపోయిన పాప బస్సు దిగేసమయంలోనే చివరి మెట్టుపై పడిపోయింది. కానీ ఆ బిడ్డను వారు గమనించలేదు. బస్సు దిగగానే ఆమెకు కళ్లు తిరగడంతో భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
బస్సు డిపోకి వెళ్లిన తర్వాత కండెక్టర్ విజయబాబు బస్సు దిగుతున్న సమయంలో మెట్టుపై పడిఉన్న పాప మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ పాపను ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తల్లి అంకమ్మ కూడా మృతి చెందింది.