1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఇద్దరమ్మాయిల అసహజ బంధం.. పెద్దలు అంగీకరించలేదనీ బలవన్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కాన, వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల పాటు ఓ గదిని అద్దెకు తీసుకుని జీవించారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ, ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలానికి చెందిన ఓ యువతి(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఖమ్మం జిల్లాలోని ఓ పట్టణంలో ఇంటర్‌ చదువుతున్నప్పుడు... అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతి(24)తో స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. గతేడాది జనవరిలో పారిపోయి వికారాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
 
ఈ విషయం తెలిసిన పెద్దలు చీవాట్లు పెట్టారు. దీంతో ఇంటి నుంచి పారిపోయారు. 3 నెలల పాటు అద్దె గదిలో ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వీరి జాడను గుర్తించిన పోలీసులు.. కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపారు. 
 
ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు వద్దనడంతో గొడవలు జరుగుతున్నాయి. మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిద్దరి అసహజ సంబంధానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించక పోవడం వల్లే ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.