గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (08:30 IST)

కాంగ్రెస్ గూటికి షర్మిల?.. ఇడుపులపాయకు రానున్న రాహుల్

ys sharmila
తెలంగాణ రాష్ట్రంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం నోరు విప్పడం లేదు. కానీ, టీఎస్ పీసీసీ వర్గాల మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నారు. వైఎస్ వర్థంతి రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించే నిమిత్తం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడప జిల్లా ఇడుపులపాయకు రానున్నారు. ఆయన సమక్షంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుంది. 
 
మరోవైపు, షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకోగా, తానెందుకు పార్టీని విలీనం చేస్తానంటూ షర్మిల ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. కానీ, పీసీసీ నేతల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు ప్రచారం జరిగి ఆగిపోయినా, తాజాగా నాలుగు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి చర్చించినట్లు తెలిసింది. 
 
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తానని వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లక ముందే తెలంగాణకు చెందిన కొందరు ముఖ్యనాయకులతో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ నాయకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని తెలంగాణ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
అయితే తాను తెలంగాణ కోసం పార్టీ పెట్టానని, తెలంగాణ కోడలిగా ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తినంటూ షర్మిల పలు సందర్భాల్లో ప్రస్తావించడాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఆమె అక్కడ పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.