మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (20:53 IST)

అచ్చెన్నను అరెస్టు చేసిన విధానం తప్పు : వైకాపా ఎంపీ

ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విధానం సరిగా లేదని వైకాపాకు చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యంగా, గోడ దూకి అచ్చెన్నను అరెస్ట్‌ చేయాల్సిన అవసరంలేదన్నారు. 
 
అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆయన స్పందిస్తూ, అచ్చెన్నాయుడే కాదు.. ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సీఎంకు తప్ప ఎవరికీ ఏసీబీ ముందుగా తెలియజేయదన్నారు. టీడీపీ నేతలు రోజుకు ఒకరు అరెస్ట్‌ అవుతారని, మంత్రులు అనడం సరికాదన్నారు. 
 
'మంత్రుల వ్యాఖ్యలతో కావాలని చేసినట్లు ఉందని అనుకుంటారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు. ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరు. కక్ష సాధింపునకే కేసులు పెడుతున్నారనడం సరికాదు. అరెస్టు చేసిన విధానం సరిగా లేదు. 
 
అలాగే, అచ్చెన్నను పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షానికి నచ్చక పోవడం వల్లే కోర్టులను ఆశ్రయించారని గుర్తుచేశారు.