శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:44 IST)

సొంత మనుషుల కోసం 40 ఏళ్ళు ఆరాట పడిన చంద్రబాబు : విజయసాయి

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు, టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ట్విటర్లో విరుచుకుపడ్డారు. ''పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి, కొడుకులు కమీషన్లు తిన్నారు. 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది. 
 
2 కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారు. చ.అడుగుకు రూ.4,500 ఖర్చవుతుందా చంద్రబాబు గారూ?. ఆర్టీసీ కార్మికులకిచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రైవేటు ఆపరేటర్ల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారు. ఆర్టీసీని ఆయన మూసివేత దశకు చేర్చి పోతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట నిలుపుకుని ఊపిరి పోశారు'' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 

''ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమీషన్లు దండుకునే బతుకు చంద్రబాబుది. సీఎం జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి 60 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం అసాధారణ నిర్ణయం. ముఖ్యమంత్రి జగన్ సాహసాన్ని అభినందించడానికి పచ్చ బానిస మేధావులెవరికీ నోరు రావడం లేదు. కుల మీడియా అయితే విలీనం అసంభవమని మొన్నటి వరకు పసలేని వాదనలు తెరపైకి తెచ్చింది'' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.