శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:02 IST)

పవన్ ఓ కీలుబొమ్మ : విజయసాయి రెడ్డి ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ ఓ కీలుబొమ్మ అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. 'తెలుగుదేశం ప్రభుత్వం తప్పుదారి పట్టించినందునే ఇప్పుడు పవన్ కల్యాణ్ నిశ్శబ్ధంగా ఉన్నారు. టీడీపీ గ్లేమ్ ప్లాన్‌లో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలా పవన్ వ్యవహరిస్తున్నారు' అని అన్నారు. 
 
ఆపై 'ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయి. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలి' అని కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.