1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (09:57 IST)

రాజీనామా ఆమోదం పొందితే టీచర్ ఉద్యోగానికి వెళ్తా : వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

karanam dharmasree
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని కోసం వేల ఎకరాల భూములను ఇచ్చిన అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో విశాఖపట్టణ రాజధానికి మద్దతుగా జాయింట్ యాక్షన్ కమిటిని కూడా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖ రాజధానికి అనుకూలంగా ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ  రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, స్పీకర్ ఫార్మెట్‌లో లేదు. అందువల్ల అది ఆమోదం పొందే అవకాశం కూడా లేదు. 
 
అదేసమయంలో కరణం ధర్మశ్రీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్‌పై నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇలా ఎంపికైన వారిలో ధర్మశ్రీ  కూడా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన ధృవపత్రాల పరిశీలనకు విద్యార్హత పత్రాలను సమర్పించారా? అన్న విలేకరుల ప్రశ్నకు ధర్మశ్రీ స్పందిస్తూ.. విద్యార్హతకు సంబంధించి  ధృవపత్రాలను పంపాలని కోరడంతో తాను పంపానని, తన రాజీనామా ఆమోదం పొందితే కనుక చోడవరం, దాని సమీపంలోని పీఎస్‌పేటలో ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతానని నవ్వుతూ చెప్పారు.