బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:51 IST)

కరోనావైరస్; నెదర్లాండ్స్ అమలు చేస్తున్న 'ఇంటలిజెంట్ లాక్‌డౌన్' ప్రమాదకరమా?

నెదర్లాండ్‌లో కూడా కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాల్లో ఈ డచ్ దేశం కూడా ఉంది. కానీ, ఇక్కడ 'ఇంటలిజెంట్ లాక్‌డౌన్' అమలు చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దక్షిణ యూరప్ దేశాలతో నెదర్లాండ్స్ సంఘీభావంతో వ్యవహరించడం లేదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ డచ్ దేశం అమలు చేస్తున్న లాక్ డౌన్ ఎలాంటిది? కరోనావైరస్‌ మూలంగా భారీగా మానవ ప్రాణాలను నష్టపోయిన ఇటలీ దీనికి ఎలా స్పందిస్తోంది?

 
ఇంటెలిజెంట్ లాక్ డౌన్ అంటే ఏమిటి?
సామూహిక రోగ నిరోధకత అనే అంశం పట్ల ముందుగా ఆకర్షితులైంది డచ్ దేశస్థులు. దీనిని ఒక డచ్ ఆరోగ్య నిపుణుడు సమర్ధించారు. డచ్ ప్రభుత్వం ఇంటెలిజెంట్ (తెలివైన) లాక్ డౌన్ విధానాన్ని అవలంబించింది. లాక్ డౌన్ వలన కలిగే ఆర్ధిక, మానసిక సమస్యలు రాకుండా తిరిగి సమర్ధవంతంగా యధా స్థితికి రావాలని ఈ దేశం ఆలోచన చేసింది.

 
పూలు అమ్మేవారు, ఇనుము వ్యాపారులు, బేకరీ దుకాణదారులు, బొమ్మలు అమ్మేవారు తమ షాపులను తెరిచే ఉంచారు. అక్కడ తలుపులు మీద పెట్టిన పోస్టర్లు, నేల మీద వేసిన టేప్ వలన ప్రజలు ఒకరి నుంచి ఒకరు తగినంత దూరంలో ఉండటానికి ఉపయోగపడుతుంది. దుకాణదారులు గ్లోవ్స్ వేసుకుని వ్యాపారం చేస్తున్నారు.

 
హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీ సెలూన్లు, రెడ్ లైట్ ప్రాంతాల మీద మాత్రం పూర్తిగా నిర్బంధం విధించారు. ఏప్రిల్ 28వ తేదీ వరకు స్కూళ్ళు, యూనివర్సిటీ లు, పిల్లల నర్సరీ లు మూసివేశారు. బార్లు, రెస్టారెంట్లు, కేఫ్ లు కూడా మూసివేశారు. "మేము ప్రశాంతంగా ఉన్నాం" అని క్లింగెన్‌డేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పని చేస్తున్న డాక్టర్ లూయిస్ వన్ క్సయిక్ అని అన్నారు.

 
"అందరిని ఇంట్లో పెట్టి నిర్బంధించాలని మేము అనుకోవటం లేదు. ఇక్కడ ప్రజలను వేర్వేరుగా ఉంచడం కూడా సులభమే. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో వాళ్ళ తాత, మామ్మలు కలిసి ఉండరు." ప్రజలను ఇంటి వద్దనే ఉండమని సలహా ఇచ్చాము. కానీ, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోలేకపోయినా, వస్తువులు కొనుక్కోవడానికి, గాలి పీల్చుకోవడానికి వాళ్ళు బయటకి వెళ్ళవచ్చు. కాకపొతే, ఒకరి నుంచి ఒకరు కనీసం 5 అడుగుల దూరం పాటించాలి.

 
డచ్ దేశస్థులు ఈ నిబంధలని పాటిస్తున్నట్లే కనిపిస్తోంది. 99 శాతం మంది ప్రజలు దూరాన్ని పాటిస్తుంటే, 93 శాతం మంది ప్రజలు ఇంటి దగ్గరే ఉంటున్నారని ఒక సర్వే పేర్కొంది. నెదర్లాండ్స్‌లో ప్రజలు పరిపక్వ మనస్తత్వం కలిగిన వారని దేశ ప్రధాని మార్క్ రట్ అన్నారు. "ఇక్కడ ప్రజలు తమను పిల్లల్లా కాకుండా ఎదిగిన వాళ్ళలా చూస్తున్నందుకు ఆనందిస్తున్నారని" అయన అన్నారు.

 
కొన్ని చోట్ల పిల్లలు ఆడుకుంటూ, టీనేజర్లు సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ జాడలు ఈ దేశంలో అంతగా కనిపించడం లేదు. అయితే, ఇదే తరహాలో బ్రిటన్ ముఖ్య వైజ్ఞానిక సలహాదారు ప్రజల్లో సామూహిక రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రణాళికను ప్రతిపాదించిన వెంటనే, అలా చేస్తే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకలు హెచ్చరించారు. దాంతో బ్రిటన్ తన పథకాన్ని విరమించుకుంది.

 
వైరస్‌ను సమాజంలో వదిలిపెట్టడం అంటే ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధమైనట్లే. ఇదే విధానాన్ని మొదట డచ్ కూడా అవలంబించింది. కానీ, నెమ్మదిగా తన విధానాన్ని మార్చుకుంది. మార్చ్ 16 వ తేదీన ప్రజలని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రట్ తన ప్రణాళికని వివరించారు. "వైరస్ వ్యాప్తి చెందడాన్ని చూస్తూ జనాభా రోగ నిరోధక శక్తి పెరుగుతుందో లేదో చూడవచ్చని" అయన అన్నారు.

 
ఇలా జరగడానికి కొన్ని నెలలు అంత కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు కానీ, ప్రజలను జాగ్రత్తగా చూసుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా చేయడానికి యుకె దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు ఏమి లేవని ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లెస్ డే రీస్ చెప్పారు. ఇది ప్రజల్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టేసిందని అన్నారు.

 
ఇది పని చేస్తుందా?
ఇన్ఫెక్షన్ రాకుండా ప్రజలు ఎంత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నారో పరిశీలించడానికి డచ్ ప్రజా ఆరోగ్య సంస్థ ఆర్ఐవిఎం అధ్యయనం చేపట్టింది. ఇది శరీరం తనంతట తానే దీనితో పోరాడటానికి శక్తిని కలుగచేసుకుని శరీరంలో యాంటీ బాడీలను తయారు చేసుకుంటుందని ప్రొఫెసర్ ఆరా తిమెన్ బీబీసీ కి చెప్పారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

 
నెదర్లాండ్స్‌ జనాభాను (1.72 కోట్లు) దృష్టిలో పెట్టుకుని చూస్తే మరణాలు ఎక్కువే సంభవిస్తున్నాయని చెప్పాలి. శనివారం నాటికి 24,500లకు పైగా ప్రజలు ఈ దేశంలో వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 2,652కు చేరింది. పెరుగుతున్న రోగుల కోసం ఆస్పత్రుల్లో పడకలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొంత మంది రోగులను జర్మనీలో ఆహోయ్ రొట్టెర్థం కాన్సర్ట్ హాల్‌కు తరలించారు.

 
పరీక్షల సంఖ్యను పెంచి, వైద్య సేవలు అందిస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని జర్మనీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే, దీనికి కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి. చైనా నుంచి తెప్పించిన పది లక్షల మాస్కుల్లో లోపాలు ఉన్నాయని తేలడంతో వాటిని వెనక్కి పంపాల్సి వచ్చింది. వ్యక్తిగత రక్షణ పరికరాల కొరత కూడా ఈ దేశంలో ఉంది. దీంతో కొన్ని సంస్థలు స్విమ్మింగ్ సూట్లతో మాస్క్ లు తయారు చేసే పనిలో ఉన్నారు

 
డచ్ ఇటలీకి ఆగ్రహం ఎందుకు తెప్పించింది?
డచ్ ప్రజలు ఎక్కువగా యూరప్ దేశాలకు అనుకూలంగా ఉంటారు. కానీ, ఇటలీలోని కొందరు ప్రముఖులు ఒక జర్మన్ పత్రికకు రాసిన ఉత్తరంలో డచ్ దేశస్థులకు నైతికత లేదని, వారి ఏ విషయంలోనూ సంఘీభావం తెలపడం లేదని ఆరోపించారు. దాంతో, దక్షిణాది యూరప్ దేశాల రుణా భారాన్ని తగ్గించే 'కరోనా బాండ్స్' జారీని నెదర్లాండ్స్, జర్మనీలు వ్యతిరేకించాయి.

 
ఈ రెండు దేశాలూ ఈయూ నుంచి పొందే దానికన్నా ఎక్కువ చెల్లిస్తుంటాయి. అయితే, నెదర్లాండ్స్ అవలంబించిన ఈ విధానం బెడిసి కొట్టిందని మాస్ట్రిచ్ యూనివర్సిటీ లెక్చరర్ రెమ్కో వాన్ డి పాస్ అన్నారు. ఇది స్వయంగా ఓడిపోవటం లాంటిదే. “దక్షిణాదిలో ఉన్న దేశాలు అన్నీ నాశనమైపోతే, ఉత్తర దేశాలకి కూడా మనుగడ ఉండదు" అని డచ్ జాతీయ బ్యాంకు మాజీ అధ్యక్షుడు నౌట్ వెళ్లింక్ అన్నారు.

 
తమ ఉత్పత్తులని ఎగుమతి చేయడానికి డచ్ దేశస్థులు ఇతర యూరోపియన్ దేశాల మీద ఆధారపడతారని ప్రొఫెసర్ క్లెస్ డి రీస్ అన్నారు. యూరోపియన్ యూనియన్ని, యూరో విలువని స్థిరంగా ఉంచడానికి తమ దేశాలకి పరస్పర అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సంక్షోభం పట్ల నెదర్లాండ్స్ మొదట్లో సరిగ్గా స్పందించలేదని, డచ్ ఆర్ధిక మంత్రి ఒప్పుకున్నారు.

 
వైద్య అవసరాల కోసం యూరోపియన్ దేశాల అన్నీ కలిసి అత్యవసర నిధి ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ప్రధాని రట్ ప్రతిపాదించారు. ఇది అవసరంలో ఉన్నవారికి సహాయపడటానికి మాత్రమేనని అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి డచ్ దేశస్థులు చాలా లాభపడ్డారని డాక్టర్ వాన్ డి పాస్ చెప్పారు. కానీ, బెల్జియంలో చేపట్టిన నిర్బంధంతో పోల్చి చూస్తే నెదర్లాండ్స్‌లో అమలు చేసిన ఇంటెలిజెంట్ లాక్ డౌన్ విధానం చాలా భిన్నంగా ఉంది

 
పుట్టినప్పటి నుంచి మరణించేవరకు వైద్య సహాయం అక్కరలేకుండా ఉండే సమాజాల్లో మాత్రమే ఇలాంటి విధానం పని చేస్తుందని డి పాస్ ఈ విధానాన్ని తప్పు పట్టారు. డచ్ అవలంబించిన విధానానికి సరైన శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. కేవలం ఇంటెలిజెంట్ లాక్ డౌన్ చేయడం ద్వారా దేశ జనాభా రోగ నిరోధక శక్తి పెరగకపోవచ్చు. ఆ విషయం పెరుగుతున్న మరణాలను విస్తరిస్తున్న వైరస్‌ కేసులను చూస్తే తెలుస్తూనే ఉంది.