శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Ganesh

మది పులకింపజేసే "కూర్గ్" హిల్‌ స్టేషన్

FILE
కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు స్వర్గధామం "కూర్గ్" హిల్ స్టేషన్. ఇక్కడి లోయల్ని, కొండ ప్రాంతాలను ఉదయభానుడి లేలేత కిరణాలు తాకకమునుపే కప్పివేసే పొగమంచు ప్రతి ఒక్కరి మనసును పులకరింపజేస్తుంది. లెక్కలేనంత విస్తీర్ణంలో సాగయ్యే వరిపొలాల పచ్చదనం.. కాఫీ, నారింజ తోటల సౌందర్య సరాగాలు.. మిరియాలు, యాలకుల మసాలా గుభాళింపులు.. వెరసీ "కూర్గ్".

దేశంలో పేరన్నిక గన్న హిల్ స్టేషన్‌లలో "కూర్గ్" ఒకటి. ఇది కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమైన మైసూర్‌కు ఇది వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ హిల్‌స్టేషన్.. మరో పర్యాటక ప్రాంతమైన "కొడగు"కు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాఖరు దాకా కూర్గ్‌ను సందర్శించేందుకు అనువైన కాలమని స్థానికులు చెబుతుంటారు.

పూర్వకాలంలో కొడగు రాజు "ముద్దురాజ" తన రాజధాని నగరంగా "ముద్దురాజ కేరీ"ని పరిపాలించినట్లు చరిత్ర కథనం. 1681లో ఆయన తన రాజధాని పేరును "మడికేరీ"గా మార్చగా.. అదే కాలక్రమంలో "కూర్గ్"గా స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆనాటి నుంచే ఈ ప్రదేశం కాఫీ, నారింజ తోటలకు ప్రసిద్ధిగాంచింది. ఆనాటి రాచరిక వైభవాన్ని చాటిచెప్పే పలు ప్రదేశాలు నేటికీ కూర్గ్‌కు తలమానికంగా నిలుస్తున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన కావేరీ నది పుట్టిన "తలకావేరీ"గల ప్రాంతంగా కూడా కూర్గ్‌కు విశేష ప్రాముఖ్యం కలదు.
ఆద్యంతం కమనీయం "బైలేకుప్పే"
కూర్గ్ సమీపంలో చూడదగ్గ వాటిలో "టిబెటన్ స్వర్ణ దేవాలయం"గా పిలవబడే "బైలేకుప్పే" ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళకు ప్రతి ఒక్కరూ ముగ్దులవకమానరు. ఇక్కడ సుమారు 5వేల మంది బౌద్ధ బిక్షువులకు విద్యాబుద్దులు నేర్పుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి...


గతంలో అనేక వివాదాల చరిత్రను కలిగి ఉన్న ఈ కూర్గ్‌ పరిసర ప్రాంతాలను పరిపాలించిన లింగాయత్ రాజులే.. ఈ ప్రాంతాన్ని కూడా పాలించినట్లు కొంతమంది స్థానికులు విశ్వసిస్తారు. ఈ లింగాయత్ రాజులే "మడికేరీ"ని రాజధానిగా స్థాపించగా.. టిప్పుసుల్తాన్ 1785లో తన సామ్రాజ్యంలో కలుపుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది.

అయితే బ్రిటీష్ పాలకుల సహాయంతో మహారాజా వీరరాజేంద్ర కూర్గ్‌ను విముక్తం చేయటంలో విజయం సాధించాడనీ.. ఆయన ఇక్కడి ప్రకృతి ప్రదేశాలతో కూడిన ఆహ్లాదకరమైన హిల్‌స్టేషన్‌గా దీనిని అభివృద్ధి చేశారని మరో కథనం. కొద్దికాలం మాత్రమే స్వేచ్ఛను అనుభవించిన ఈ ప్రాంతం చివరి రాజైన చిక్కవీర రాజేంద్రను అదుపులోకి తీసుకున్న బ్రిటీష్ పాలకులు 1834లో కూర్గ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.

చూడదగ్గ ప్రాంతాల విషయానికి వస్తే... లెక్కలేనంత విస్తీర్ణంలో చక్కగా ఒదిగిపోయిన కూర్గ్‌ కాఫీ తోటల సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక్కడి విభిన్నమైన కాఫీ మొక్కల గురించి తెలుసుకోవాలంటే గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ ప్రధానంగా ఆరేబికా, రోబస్టా అనే రెండు రకాల కాఫీ గింజలు పండుతాయి. ఈ తోటల గుండా నడచి వెళ్తుంటే ఒక్కోసారి మన కాళ్లు పూర్తి నీటిలో మునిగిపోతుంటాయి.

కూర్గ్‌లోని కావేరీ నది తీరంలోని డ్యూబారే అడవి సమీపంలో గల "డ్యూబారే ఎలిఫెంట్ క్యాంప్" చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. నిజానికి ఇది ఏనుగులకు శిక్షణనిచ్చే ఒక శిభిరం. ఏనుగులను పట్టే అలవాటును ఇప్పుడు అక్కడ నిలుపు చేశారు. అక్కడి క్యాంపులోని ఏనుగులను స్నానం చేయించడానికి, శుభ్రపరచడానికి నది తీరానికి తీసుకువస్తుంటారు.

FILE
మడికేరీ పట్టణం మధ్యభాగంలోగల బృహత్తరమైన కోట చూడదగ్గ ముఖ్య ప్రదేశం. 19వ శతాబ్దం నాటిదైన ఈ కోట అనేక యుద్దాలకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. ఈ కోట నుండి కూర్గ్ పట్టణ సౌందర్యాన్ని తనివితీరా వీక్షించవచ్చు. ఈ కోటలో ప్రస్తుతం ఒక చిన్న మ్యూజియం ఉంది. అందులో కొన్ని చారిత్రాత్మక పెయింటింగులు, ఆయుధాలు, కవచకాలు, నాటి రాజులు ధరించిన దుస్తులు, అప్పటి జైలులోని వస్తువులు వంటివి చూడవచ్చు.

అత్యద్భుతమైన ఇస్లామిక్, గోథిక్ శిల్పకళా రీతులతో ఉట్టిపడే పరమశివుడి ఆలయమైన "శ్రీఓంకారేశ్వర దేవాలయం" కూర్గ్‌లో తప్పక చూడదగ్గ ఆలయం. ఈ చారిత్రాత్మకమైన ఆలయాన్ని 1820వ సంవత్సరంలో కూర్గ్ రాజు నిర్మించాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ గుడి గోపురంపైగల గుండ్రని బంతిలాంటి "వాతావరణ గడియారం" పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

పూర్వం "జెస్సీ ఫాల్స్" అని పిలువబడే "అబ్బీ జలపాతం" కూడా చూడదగ్గదే. స్థానిక యాసలో అబ్బీ అంటే "కొడగు" అని అర్థం కాగా, కొడగు జలపాతం అని కూడా పిలుస్తుంటారు. ఎంతో సుందరమైన ఈ జలపాతం కూర్గ్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి, మార్చి వరకు ఈ జలపాతంలో నీరు పుష్కళంగా ఉంటుంది పర్యాటకులను అలరిస్తుంది.

కూర్గ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో గల "భాగమండలం" తప్పక వీక్షించాల్సిన ప్రదేశం. పవిత్ర ఆలయాలకు పేరు గాంచిన ఈ భాగమండలం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలకు నెలవు. ఇక్కడే కావేరీ నది సుజ్యోతి, కన్నికలతో సంగమిస్తుంది. ఇక్కడి తటాకం సమీపంలోనే అశ్వంత వృక్షం ఉంది. అగస్త్య మహామునికి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యింది ఇక్కడేనని స్థానికులు చెబుతారు. ఇంతటి పవిత్రత కలిగిన ప్రదేశం కాబట్టి, ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు పవిత్రస్నానాలను ఆచరిస్తుంటారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన జరిగే "తుల సంక్రమణ" రోజున కావేరీ మాత జల ప్రవాహంలో వేలాదిమంది పుణ్యస్నానాలను ఆచరించటం ఆనవాయితీ. అలాగే... నాగర్‌హోల్‌కు వెళ్లే దారిలోగల "ఇరుపు జలపాతం" కూడా చూడదగ్గదే. ఇది వీరాజ్‌పేట్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో మంచి పర్యాటక ప్రదేశంగానేకాక, పిక్నిక్ స్పాట్‌గా కూడా ప్రసిద్దిగాంచింది. కావేరీనదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఒడ్డున గల శివాలయం కూడా చూడదగ్గదే..!

కూర్గ్ సమీపంలో చూడదగ్గ వాటిలో "టిబెటన్ స్వర్ణ దేవాలయం"గా పిలవబడే "బైలేకుప్పే" ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళకు ప్రతి ఒక్కరూ ముగ్దులవకమానరు. ఇక్కడ సుమారు 5వేల మంది బౌద్ధ బిక్షువులకు విద్యాబుద్దులు నేర్పుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి ఒక చిన్న టిబెటన్ గ్రామంలా ఉంటుందంటే అతిశయోక్తి కానేరదు. జవహర్‌లాల్ నెహ్రూ బౌద్ద భిక్షువులకు ఇచ్చిన రెండు మఠాలలో ఇది ఒకటి కాగా.. మరొకటి హిమాచల్‌లోని "ధర్మశాల"లో ఉంది.

"కూర్గ్"కు ఎలా వెళ్లాలంటే...? ఇక్కడికి వెళ్లేందుకు ఎంతో అనుకూలమైన రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. కూర్గ్‌కు సమీప రైల్వేస్టేషన్ మైసూర్. ఇక్కడ్నుంచి కూర్గ్ 114 కి.మీ. దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మైసూరుకు రైళ్ల సౌకర్యాలు ఉన్నాయి. ఇక రోడ్డుమార్గంలో మైసూర్ నుండి 120 కి. మీ. దూరంలో కూర్గ్ ఉంటుంది. ఇక బస విషయానికి వస్తే... కూర్గ్‌లో యాత్రికులు మజిలీ చేసేందుకు పలు రిసార్ట్‌లు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే కూర్గ్ చెక్కేయండి మరి...!!