రైల్వే బడ్జెట్ 2016-17: మహిళలకు 24x7 కాల్ సెంటర్.. భద్రతకు పెద్దపీట.. ముఖ్యాంశాలు
రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రైల్వే శాఖ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లకు భయపడబోమని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మహిళల భద్రతకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేశామని ప్రకటించారు. మహిళల భద్రత కోసం 24x7 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలకే కాకుండా సీనియర్ సిటిజన్ల కోటాను 50శాతానికి పెంచినట్లు వెల్లడించారు.
రైల్వేలను పునర్ వ్యవస్థీకరించాల్సిన సమయం ఆసన్నమైందని సురేష్ ప్రభు తెలిపారు. గత సంవత్సరం మధ్యకాలిక ప్రణాళికతో బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఈ సారి పునర్ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపోతే రైల్వేలు, పోర్టులకు మధ్య కనెక్టివీటీకి ఏర్పాటు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ టెండరింగ్ ద్వారా పనులు సాగుతాయన్నారు. ఐటీ వినియోగానికి రైల్వేలో ప్రాధాన్యత ఇస్తామని బడ్జెట్ ప్రసంగ పఠనంలో సురేశ్ ప్రభు వెల్లడించారు. అలాగే సీనియర్ సిటిజన్స్కు లోయర్ బెర్తులో ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చారు.
బడ్జెట్లో ముఖ్యాంశాలు చూద్దాం..
* రోజుకు 7 కి.మీ మేర బ్రాడ్ గేజీ లైన్ నిర్మాణం చేపడుతాం
* 820 ఓవర్ బ్రిడ్జిలను ఈ ఏడాది నిర్మిస్తాం
* 50 శాతం రైల్వేల విద్యుదీకరణపై దృష్టి పెడతాం
* మేకిన్ ఇండియాలో భాగంగా రెండు లోకర్ ఫ్యాక్టరీలు
* సోషల్ మీడియాలో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పనులు చేపడతాం
* దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ప్రెస్లో తొలిసారిగా బయో టాయిలెట్స్
* సీసీ కెమెరాల పరిధిలో ప్రధాన రైల్వే స్టేషన్లు
* 311 స్టేషన్లలో సీసీ కెమెరాలు
* రూ.1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం
* 2008-14 నుంచి 8శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు
* గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం
* లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్
* భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటున్నాం