గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 నవంబరు 2022 (18:14 IST)

గ్రీన్‌ హైడ్రోజన్‌ కేంద్రం ఏర్పాటుకి కర్నాటక ప్రభుత్వంతో ఏబీసీ క్లీన్‌టెక్‌ అవగాహన ఒప్పందం

image
దేశంలో సుప్రసిద్ధ పునరుత్పాదక విద్యుత్‌ సంస్ధలలో ఒకటైన యాక్సిస్‌ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఏబీసీ క్లీన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తాము కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నామని వెల్లడించింది. ఇన్వెస్ట్‌ కర్నాటక 2022లో భాగంగా చేసుకున్న ఈ ఎంఓయులో భాగంగా  సంవత్సరానికి 0.2 మిలియన్‌ టన్స్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రంతో పాటుగా 5 గిగావాట్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లతో మిళితమై సంవత్సరానికి ఒక మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేయబోతున్న ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం దాదాపు 50వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ తయారీ కేంద్రాల ద్వారా రాబోయే పదేళ్లలో 5వేల మందికి ఉపాధి లభించనుంది. గౌరవనీయ కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్‌ బొమ్మై  సమక్షంలో ఈ ఎంఓయుపై ఏబీసీ క్లీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌తో పాటుగా కర్నాటక రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి సంతకాలు చేశారు.
 
ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ఈ.వి. రమణా రెడ్డి మాట్లాడుతూ, ‘‘గత సంవత్సరం ఇండియాలో అత్యధికంగా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పొందిన రాష్ట్రం కర్నాటక. అంతేకాదు వ్యాపారాలను అతి సులభంగా చేసుకునే రాష్ట్రాలలో ఇది అగ్రగామి. ఇన్వెస్ట్‌ కర్నాటక 2022 ద్వారా మరింతగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము. పునరుత్పాదక శక్తి ద్వారా మాత్రమే పర్యావరణం సమతుల్యత కాపాడుకోవడంతో పాటుగా భావి తరాలకు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందించగలము’’ అని అన్నారు.
 
ఏబీసీ క్లీన్‌టెక్‌ సీఎండీ శ్రీ రవికుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఇన్వెస్ట్‌ కర్నాటక 2022లో భాగమైనందుకు  గౌరవంగా భావిస్తున్నాము. ఈ ప్రతిపాదనతో  నెట్‌జీరో కార్బన్‌ ఆర్ధిక వ్యవస్ధ దిశగా దేశం పయణించేందుకు తోడ్పడగలమనే విశ్వాసంతో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సృష్టించబడే ఉద్యోగావకాశాలు రాష్ట్రాభివృద్ధికి సైతం తోడ్పడనున్నాయి. కర్నాటక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.