వైడ్బాడీ విమాన సర్వీసులను జూలై మధ్య వరకు తగ్గించనున్న ఎయిరిండియా
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు ప్రకటించింది. సుమారు 15 శాతం మేర ఈ సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వైడాబాడీ బోయింగ్ 777 విమానాలకు మరింత విస్తృతంగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా స్పష్టం చేసింది.
గత కొంతకాలంగా నిర్వహణాపరమైన సమస్యలు కూడా ఎయిరిండియాను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గడిచిన ఆరు రోజుల్లో సంస్థకు చెందిన 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రస్తుత సర్వీసులు తగ్గింపునకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
బోయింగ్ 777 విమానాల్లో చేపట్టే ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా ప్రయాణ భద్రతను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ను సంప్రదించాలని సూచించింది.