1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆదాయ పన్ను మినహాయింపులకు రాం రాం..

Income Tax
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వేతన జీవులతో పాటు వ్యాపారులకు ఇస్తూ వచ్చిన ఆదాయ పన్ను మినహాయింపులకు కేంద్ర ఆర్థిక శాఖ స్వస్తి పలకనుది. దీనిపై త్వరలోనే అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది. 
 
ప్రస్తుతం ప్రస్తుతం ఆదాయపు పన్ను విధింపునకు రెండు రకాల మార్గాలున్నాయి. కొన్ని రకాల వ్యయాలు, మదుపుపై మినహాయింపులు ఇస్తూ, ఆదాయంపై ఎక్కువ పన్నురేటు విధిస్తున్నది ఒకటి అయితే.. ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఆదాయానికి తక్కువ పన్నురేటు విధించేది మరొకటి. 
 
2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన 'మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం'లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా, కొన్ని మార్పుచేర్పులు చేస్తారని సమాచారం.
 
ఇప్పటివరకు పన్ను చెల్లింపుదార్లు ఏ పన్ను విధానం కావాలంటే దాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. సంక్లిష్టమే అయినా పాత పన్ను విధానంలోనే ఎక్కువ మంది కొనసాగుతున్నారు. పిల్లల చదువులు పూర్తయి, ఇంటి రుణం తీరిపోయిన వారు మాత్రమే కొత్త విధానానికి మారుతున్నట్లు గుర్తించారు. 
 
అందుకే సరళంగా ఉండే కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఇందులో వార్షికాదాయం రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. ఆ తర్వాత రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5-7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5-10 లక్షల వరకు 15 శాతం, రూ.10-12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5-15 లక్షల వరకు రూ.25 శాతం, రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను విధిస్తున్నారు. అయితే ఈ పన్ను విధానంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు.