గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (10:19 IST)

23 నుంచి రూ.2 వేల నోటు మార్పిడి... గుర్తింపు కార్డు అక్కర్లేదు

currency
భారత రిజర్వు బ్యాంకు తీసుకున్న కీలక నిర్ణయంతో రూ.2 వేల నోటు సెప్టెంబరు 30వ తేదీ తర్వాత రద్దుకానుంది. ప్రస్తుతం ఈ నోటు ఉన్న వారు మంగళవారం వారం నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకుల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి రూ.20 వేల చొప్పున ఎలాంటి ధృవపత్రాలు, గుర్తింపు కార్డు లేకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. ఈ మేరకు వివరాలు తెలుపుతూ, అన్ని సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లకు సమాచారం చేరవేసింది. 
 
ప్రజలు ఎవరైనా రూ.2 వేల నోట్లను 10 వరకు తెచ్చుకుని, ఇతర నోట్లకు మార్చుకోవచ్చని స్పష్టంచేసింది. నోట్లు మార్చుకునే సమయంలో ఎలాంటి గుర్తింపుకార్డు సమర్పించాల్సిన అవసరం లేదనీ తెలిపింది. రూ.2,000 నోట్ల మార్పిడికి ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు అనుమతి ఇస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిబంధనలకు లోబడి ప్రజలకు సహకరించాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడి కార్యక్రమం సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించింది.
 
ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రూ.2 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఒక లావాదేవీలో 10 నోట్లకు మించి మార్చుకునే వీలుండదు. రూ.2 వేల నోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేసుకునేందుకు గరిష్ట పరిమితిని ఆర్బీఐ తెలుపలేదు. అయితే తమకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో, ఇతర శాఖల్లో కేవైసీ, ఇతర నిబంధనల ప్రకారం.. ఎంతమేర గరిష్ఠంగా నగదు జమ చేసేందుకు అనుమతి ఉంటే, అంత విలువ వరకు రూ.2 వేల నోట్లను ఖాతాలో వేసుకోవచ్చని చెబుతున్నారు.
 
2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినందున, ఆ నోట్లు పనికి రాకుండా పోయాయి. అయితే ఇప్పుడు రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నారేగానీ, వీటి చెల్లుబాటు (లీగల్ టెండర్) కొనసాగుతుందని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల ప్రజలు తమ లావాదేవీలకు ఈ నోట్లను సెప్టెంబరు వరకు ఉపయోగించుకోవచ్చు.