శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (18:02 IST)

ఇక జియోమార్ట్ సేవలు - తొలి ఆర్డర్ చేసిన వారికి అవి ఉచితం... ఈషా అంబానీ

ఇకపై దేశంలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిద్వారా కిరాణా సరకులు తొసిసారి ఆర్డర్ చేసిన వారికి ఫేస్ ‌మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా అందజేస్తారు. 
 
బుధవారం ముంబై కేంద్రంగా 43వ వార్షిక సమావేశం జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్‌లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు తెలిపింది. 
 
ముంబైలో జరిగిన ఈ సమావేశానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు, ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను తొలుత వెల్లడించారు. 
 
వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన సరుకులను అందజేయడానికి జియోమార్ట్‌ను తీసుకొస్తున్నట్టు ఈషా అంబానీ తెలిపారు. కస్టమర్లు, కిరాణా షాపు యజమానులు, ఉత్పత్తిదారులను అనుసంధానం చేయడం... రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్‌ను నలుమూలలకు తీసుకెళ్లడం అనే రెండు పిల్లర్ల ఆధారంగా జియో మార్ట్ పని చేస్తుందన్నారు. 
 
అలాగే, జియో గ్లాస్‌లో రియాలిటీ హెడ్‌సెట్ ఉంటుంది. దీని ద్వారా వర్చువల్ ఇమేజెస్‌ను చూడవచ్చు. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. సింగిల్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది. దీని ద్వారా మొబైల్‌కు కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే 25 యాప్స్‌ను ఇందులో ఇన్‌స్టాల్ చేసినట్టు తెలిపారు.
 
వీడియో మీటింగ్స్‌కు కూడా ఈ గ్లాసులు అనువుగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అ గ్లాసులు చాలా ఉపకరిస్తాయి. చారిత్రక ప్రదేశాలతో పాటు వివిధ అంశాలను వర్చువల్‌గా చూస్తూ పాఠాలను నేర్చుకోవచ్చు. త్రీడీని కూడా ఈ గ్లాస్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. 
 
అదేవిధంగా జియో టీవీ ప్లస్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ తదితర పలు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇందులో ఉన్నాయి. వాయిస్ సర్చ్ కూడా అందుబాటులో ఉంటుంది.