గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (18:31 IST)

రెండేళ్ళపాటు మారటోరియం పొడగింపు???

కరోనా లాక్డౌన్ కారణంగా దేశంలో వలస కూలీలు మొదలుకుని నెలసరి వేతనాలు తీసుకునే ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. ముఖ్యంగా, ఉద్యోగస్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం లాక్డౌన్‌ దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోయాయి. మరికొన్ని కంపెనీలు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రుణాల చెల్లింపుపై ఆర్బీఐ తొలుత మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత దీన్ని మరో మూడు నెలల పాటు పొడగించింది. ఈ గడువు ముగిసిపోయింది. 
 
అయినప్పటికీ, మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు, స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. అపుడు మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోరింది. 
 
కేంద్రం, ఆర్బీఐ తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని, మారటోరియం పొడిగింపుపై ప్రభుత్వ ఆలోచనను తెలిపేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపారు. 
 
దీంతో వారం రోజుల గడువు ఇస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయి. రెండేళ్ల పాటు దీన్ని అమలు చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.