శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (15:26 IST)

వైద్య విద్య ప్రవేశాలకు మార్గం సుగమం: ప్రకటన జారీ చేసిన ఎన్టీఆర్‌ వర్సిటీ

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: రాష్ట్రంలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో ఏర్పడిన సందిగ్ధత తొలగింది. 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో, యునానీ డిగ్రీ కోర్సులు, తిరుపతి పద్మావతి వైద్య కళాశాల (మహిళ)ల్లో అందుబాటులో ఉన్న సీట్ల భర్తీకి ప్రకటన(నోటిఫి కేషన్‌) విడుదలైంది. ఎంబీబీఎస్‌ తరగతులను సైతం ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నారు.
 
రిజర్వేషన్‌ కేటగిరీ సీట్లకు సంబంధించిన 550 జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ జీవో 159ని శుక్రవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వు కోసమే ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసిన వెంటనే ప్రకటన ఇచ్చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ప్రవేశాల ప్రక్రియమొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు చేస్తే... చివరి వరకు అన్ని విడతల కౌన్సెలింగ్‌లకు అదే సరిపోతుందని తెలిపారు.
 
ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలుత ఆల్‌ ఇండియా కోటా కింద ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో 15% సీట్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా 85%, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా(ఎ-కేటగిరి) కింద ఉండే 50% సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 13వ తేదీ నుంచి 21 తేదీ సాయంత్రం 4గంటల్లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
 
వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అంగవైకల్య పరీక్షలకు సంబంధించి విశ్వవిద్యాలయం నియమించిన ప్రత్యేక మెడికల్‌ బోర్డు ముందు ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, నిర్వహణ రుసుంగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3,540, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు రూ.2,950 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
 
కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతులు 
రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం తరగతులను ఈనెల 23 నుంచి ప్రారంభించనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారం కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతులను ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులంతా తరగతులకు తప్పకుండా హాజరు కావాలని స్పష్టంచేశారు.

అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలివీ..
అభ్యర్థులు నీట్‌ యూజీ ర్యాంకు కార్డు,
పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం,
 విద్యార్హతలు, ఆరో తరగతి నుంచి పది వరకు స్టడీ సర్టిఫికేట్‌(లోకల్‌ ప్రాధాన్యతకు), 
 
బదిలీ సర్టిఫికేట్‌, కుల, మైనార్టీ, ఆదాయ, అంగవైక్యల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడా, పోలీసు అమరవీరుల సంతతి, ఆంగ్లో ఇండియన్‌ ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నివాస ధ్రువీకరణ, ఆధార్‌ కార్డు, లోకల్‌ ప్రాధాన్యతకు సంబంధించి తహసీల్దార్‌ ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటోలు, అభ్యర్థి సంతకం అప్‌లోడ్‌ చేయాలి.