ఇంట్లోనే ఐటీ దుకాణం తెరిచిన పన్నీర్: చిన్నమ్మకు ఊపిరాడనివ్వని ప్రచార హోరు
నిన్న మొన్నటి దాకా ఆయన సాధువు, జనం పరిభాషలో చెప్పాలంటే మన్ను తిన్న పాము. అంతమెత్తగా, నిరాసక్తంగా, భక్తితో, అమ్మ చెప్పిందే వేదంలా పాటించిన పరమ సాత్వికుడు. కాని ఒకసారి చిన్నమ్మపై తిరుగుబాటు మొదలెట్టాక ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తన శక్తులన్నిం
నిన్న మొన్నటి దాకా ఆయన సాధువు, జనం పరిభాషలో చెప్పాలంటే మన్ను తిన్న పాము. అంతమెత్తగా, నిరాసక్తంగా, భక్తితో, అమ్మ చెప్పిందే వేదంలా పాటించిన పరమ సాత్వికుడు. కాని ఒకసారి చిన్నమ్మపై తిరుగుబాటు మొదలెట్టాక ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తన శక్తులన్నింటినీ మోహరించి ప్రత్యర్థి శిబిరాన్ని కంపింప జేస్తున్నారు. ప్రచారం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో తెలిసిన అనుభవజ్ఞుడిలా ఇంటిలోనే ఐటీ దుకాణం తెరిచేశారు. ఆయన స్పీడ్ చూసి ప్రత్యర్థులే నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారంటే తమిళనాడులో పన్నీర్ సెల్వం హవా ఎంతలా నడుస్తోందో అర్థమవుతుంది.
పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ఆపద్ధర్మ ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం మరో వైపు ప్రజల మద్దతు కూడా సంపాదించేందుకు అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని రంగంలోకి దించారు. వారు 3 రోజులుగా పన్నీర్ ఇంటినుంచే సోషల్ మీడియాలో ప్రజల నుంచి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విభాగాన్ని పన్నీర్ తన శిబిరంలోకి చేర్చుకున్నారు.
ఈ విభాగం బాధ్యులకు తన ఇంటి ఆవరణలోనే కొంత స్థలం ఇచ్చి వాట్సాప్, ట్వీటర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా శశికళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లన్నీ సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసి మీ ఎమ్మెల్యేను పన్నీర్కు మద్దతు ఇవ్వమని సందేశాలు పంపాలని అభ్యర్థించారు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు సెల్వంకు మద్దతు ఇవ్వాలని పోస్టింగ్లు, మెసేజ్లు పంపుతున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచి శశికళ శిబిరం నుంచి బయటకు తెచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు.