1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (10:50 IST)

ఢిల్లీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 37మంది డాక్టర్లకు పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో 37 మంది డాక్టర్లకు ఒకేసారి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. భారత్‌లో ఇప్పటికే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, వైద్యులకు కూడా మహమ్మారి సోకడం, అందులో ఐదుగురికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరడంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 
 
గడిచిన కొన్ని వారాలుగా ఢిల్లీ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ కేసులు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 7 వేల మార్క్ ను తొలిసారి దాటేశాయి. కాగా, గత కొన్ని రోజులుగా ఆసుపత్రులకు వస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్లు నిండుకున్నాయి. వీరిలో పలువురు హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారని అధికారులు అంటున్నారు.
 
ఇక సర్ గంగారామ్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యుల్లో చాలా మంది యువకులేనని, వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకున్నారని ఉన్నతాధికారులు వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 
 
ఈ వైద్యుల్లోని చాలా మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ 37 మందిలో 32 మంది ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారని, మిగతావారికి మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు.