1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (10:49 IST)

దేశంలో కరోనా మృతులు 3847 - పాజిటివ్ కేసులు 2.11 లక్షలు

దేశంలో కరోనా వైరస్ సోకి ఏకంగా 3847 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గత 24 గంటల్లో కొత్త‌గా 2,11,298 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... బుధవారం 2,83,135 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093కు చేరింది. మరో 3,847 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,15,235కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,46,33,951 మంది కోలుకున్నారు. 24,19,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,26,95,874 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా 18,285 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా మరో 99 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. 
 
దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,27,390కి, మొత్తం మరణాల సంఖ్య 10,427కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,296 మందికి వైరస్‌ సోకగా.. అనంతపురంలో 1,876, చిత్తూరులో 1,822, విశాఖపట్నంలో 1,800, పశ్చిమగోదావరిలో 1,664, గుంటూరులో 1,211, శ్రీకాకుళంలో 1,207, నెల్లూరులో 1,159, ప్రకాశంలో 1,056, కర్నూలులో 1,026, కడపలో 877, కృష్ణాలో 652, విజయనగరంలో 639 కేసులు నమోదయ్యాయి.