1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (09:44 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్: అద్భుతం చేసిన కంగారులు...

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన జట్లలో ఫేవరేట్‌ జాబితాలోనే లేని జట్టు ఆస్ట్రేలియా. కానీ, ఈ పొట్టి ప్రపంచ కప్‌లో అద్భుతం చేసింది. టోర్నీలో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ సూపర్‌-12 దశ ఆఖర్లో గొప్పగా పుంజుకుని.. సెమీస్‌లో సంచలన విజయం సాధించి.. చివరకు ఫైనల్లో సిసలైన ఛాంపియన్‌లా ఆడి విశ్వవిజేతగా నిలిచింది. 
 
ఫలితంగా టీ20 ప్రపంచ కప్‌ను తొలిసారి ముద్దాడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్ళు తమ శక్తి సామర్థ్యాలనన్నింటినీ అసలు సమరం కోసమే దాచుకున్నట్లు ఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. లక్ష్యం చిన్నదేమీ కాకున్నా, ప్రత్యర్థికి బలమైన బౌలింగ్‌ దళం ఉన్నా మిచెల్‌ మార్ష్‌, వార్నర్‌ మెరుపులతో కంగారూల జట్టు అలవోకగా ఛేదించింది. 
 
అదిరిపోయే ఆటతీరుతో తొలిసారి చిట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. మిచెల్‌ మార్ష్‌ (77 నాటౌట్‌; 50 బంతుల్లో 6×4, 4×6), వార్నర్‌ (53; 38 బంతుల్లో 4×4, 3×6) విధ్వంసం సృష్టించడం వల్ల ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. 
 
ప్రపంచకప్‌ గెలిచిన ఆరో జట్టు ఆస్ట్రేలియా. ఆ జట్టుకు ఇదే తొలి టీ20 టైటిల్‌. ఇంతకుముందు భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), ఇంగ్లాండ్‌ (2010), వెస్టిండీస్‌ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్‌ (2016) విజేతలుగా నిలిచాయి. 
 
ఈ విజయంతో ప్రైజ్‌మనీగా విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ.11.89 కోట్లు, రన్నరప్‌‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.5.94 కోట్లు, సెమీస్‌లో ఓడిన ఒక్కొక్క జట్టుకు రూ.2.97 కోట్లు చొప్పున ఐసీసీ అందజేసింది.